పేదలకు స్థానంలేని రాజధాని అమరావతితో ప్రయోజనం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగం లేని అమరావతిలో చట్టాలు చేసే అసెంబ్లీ ఉండటం కూడా అనవసరమేనని అన్నారు.
రమేశ్ ఆసుపత్రి యజమాని డాక్టర్ రమేశ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు తన ఇంట్లో దాచారని కొడాలి నాని ఆరోపించారు. తప్పు చేయకపోతే రమేశ్ ఎందుకు పారిపోతారని ప్రశ్నించారు. ఒక మహిళను ముందు పెట్టి పారిపోవడం దారుణమని చెప్పారు. చంద్రబాబు విషయంలో సినీహీరో రామ్ జాగ్రత్తగా ఉండాలని నాని హితవు పలికారు. ఏ సామాజికవర్గంపై కూడా తమ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు.