దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా నిర్వహించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు మాత్రమే కాదు, ఆయనో విద్యావేత్త, రచయిత, కళాభిరుచి ఉన్న వ్యక్తి, అని అభివర్ణించారు. ప్రధానమంత్రిగా దేశం నూతన ఆర్థిక వ్యవస్థకు బీజాలు వేసింది ఆయనే అని అన్నారు.
దక్షిణాది నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలకు ఆయనతో దృఢ అనుబంధం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి పీవీని గర్వకారణంగా భావిస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగో ముఖ్యమంత్రి. అంతేకాదు, ఎంపీగా బరిలో దిగేందుకు తెలుగు గడ్డపై ఉన్న నంద్యాల ప్రాంతాన్నే ఎంచుకున్నారని తెలిపారు. 2004లో పీవీ మరణించాక ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ప్రాంతాన్ని మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పీవీ ఘాట్ గా నామకరణం చేశారని లేఖలో పేర్కొన్నారు.