ఐపీఎల్ ఈ సీజన్ లో వెనకపడుతుందనుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పుంజుకుంది. ప్లేఆఫ్ రేసులో వెనుకబడుతున్న దశలో కీలక విజయం సాధించింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో అశ్విన్ సేన 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేసింది. రాహుల్ త్రిపాఠి (50; 45 బంతుల్లో 4×4) టాప్స్కోరర్. రవిచంద్రన్ అశ్విన్ (2/24), మురుగన్ అశ్విన్ (1/24) ప్రత్యర్థికి కళ్లెం వేశారు. అంతకుముందు పంజాబ్ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (52; 47 బంతుల్లో 3×4, 2×6), డేవిడ్ మిల్లర్ (40; 27 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఆఖర్లో అశ్విన్ (17 నాటౌట్; 4 బంతుల్లో 1×4, 2×6) మెరుపులే ఇరు జట్ల మధ్య తేడాగా నిలవడం గమనార్హం. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్లలో తెలివిగా వ్యవహరించి కెప్టెన్గానూ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్నే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో మెరుగైన స్థితిలోనే ఉన్నా..ఛేదనలో చాలా వరకు పోరాడక తప్పట్లేదు. తొలి నలుగురు బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లే చేశారు. కానీ బట్లర్ (23), శాంసన్ (27) మంచి ఆరంభాల్ని సద్వినియోగం చేసుకోలేదు. పరుగుల వేగం ఆశించిన స్థాయిలో లేకపోవడం రాయల్స్ను దెబ్బ తీసింది. ఒక దశలో స్కోరు 127/2. కానీ అప్పటికే 15.5 ఓవర్లు అయిపోయాయి. అప్పుడే త్రిపాఠి ఔటైపోయాడు. దీంతో చివరి 4 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దశలో మెరుపులు మెరిపిస్తారనుకున్న టర్నర్ (0), ఆర్చర్ (1) ఇలా వచ్చి అలా వెనుదిరిగారు. చివర్లో బిన్నీ (33 నాటౌట్; 11 బంతుల్లో 2×4, 3×6) ధాటిగా ఆడాడు కానీ.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతడి మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయంతే.
అంతకుముందు పంజాబ్ ఇన్నింగ్స్లో అశ్విన్ ఇన్నింగ్సే కొసమెరుపు. అతను ఆడింది 4 బంతులే. కానీ ఆ నాలుగు బంతుల్లోనే మూడు మెరుపు షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు అశ్విన్. అతను బాదిన రెండు సిక్సర్లూ కళ్లు చెదిరిపోయేలా చేసినవే. ఇలాంటి బ్యాట్స్మన్ ఇంత దిగువన వస్తున్నాడేంటి అనిపించేలా చివరి ఓవర్లో చెలరేగాడు అశ్విన్. అతడి ధాటికి ధవళ్ కులకర్ణి వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు చేసిన పంజాబ్.. అనుకున్న దాని కంటే మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్ను ముగించింది. అంతకుముందు పంజాబ్ ఇన్నింగ్స్ ఒడుదొడుకులతో సాగింది. 13 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 97/2. తన శైలికి భిన్నంగా ఆడిన కేఎల్ రాహుల్ అప్పటికి 32 బంతుల్లో 25 పరుగులే చేశాడు. అతను ఆరంభం నుంచి చాలా నెమ్మదిగా ఆడాడు. గేల్ (30; 22 బంతుల్లో 2×4, 3×6) మంచి ఊపుమీదున్న సమయంలో ఔటైపోయాడు. మయాంక్ (26; 16 బంతుల్లో 1×4, 2×6) కూడా అంతే. ఆ తర్వాత రాహుల్, మిల్లర్ నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకోలేదు. ఐతే 14, 15 ఓవర్లలో వీళ్లిద్దరూ చెలరేగడంతో 39 పరుగులొచ్చాయి. ఐతే చివరి ఓవర్లలో రాయల్స్ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు. 12 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీని తో పంజాబ్ 152/2 నుంచి 164/6కు చేరుకుంది. అయితే అశ్విన్ చివరి ఓవర్ లో చూపిన మెరుగైన ఆటతో జట్టుకు మంచి స్కోరునందించాయి.
నేటి మ్యాచ్ : హైదరాబాద్ vs చెన్నై రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానంటున్న రేవంత్ రెడ్డి…