రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది.
నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే ఢిల్లీకి చేరుకున్న ద్రౌపతి ముర్ము ఒడిశా భవన్లో బస చేశారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది.
ఢిల్లీకి చేరుకున్న అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులనూ కలిశారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తరాంధ్రకు ఎవరేం చేశారో చర్చిద్దామా? : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు