telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోరంట్ల మాధవ్ వ్యవహారం : స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం..చర్యలకు ఆదేశాలు

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు మహిళా నేతలు చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. గోరంట్ల మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నీటీ ఫర్ ఉమెన్ జేఏసీ నేతలు రాష్ట్రపతితో పాటు జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు.

ఇందుకు స్పందించిన ఆమె.. ఆ కాపీని ఏపీ సిఎస్ కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం లెటర్ పంపించింది.

కాగా.. గోరంట్ల మాధవ్ న‌గ్నంగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఎంపీ మాధవ్ చొక్కా లేకుండా ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడారని ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. టీడీపీ శ్రేణులు ఆ వీడియోను తెగ వైరల్ చేశారు. దీనిపై రాజకీయం దుమారం రేగడంతో గోరంట్ల మాధవ్ ఆ వీడియోపై వివరణ ఇచ్చారు.

తాను జిమ్ లో ఉండగా ఆ వీడియో తీసుకున్నానని, దానిని ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అన్నారు. టీడీపీ నాయకులే కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఎంపీ ఆరోపించారు. దీనిపై జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీడీపీ కి చెందిన కొందరు వ్యక్తులు చేసిన కుట్ర అని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.

అలాగే ఈ వీడియోను అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు విడుదల చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్రుడు.. ఎంపీ గోరంట్లపై పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలు మాధవ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ 50 లక్షల మేర పరువు నష్టం దావా వేశారు.

Related posts