telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జున పొలంలో మృతదేహం… వీడిన మిస్టరీ

Nag

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది. షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహాం దొరికింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకోవడం.. ఆ బాడీకి పోస్టు మార్టమ్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అసలు అక్కడ చనిపోయింది ఎవరు అని ఆరా తీసారు పోలీసులు. పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయక్షేత్రంలో నాగార్జున సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకోసమే నిపుణులను కూడా పంపించాడు ఈయన. వ్యవసాయ సాగు కోసం భూమి దగ్గరికి వచ్చిన నిపుణులకు ఓ గదిలో కుళ్లిపోయిన శవం కనిపించడం కలకలం రేపింది. కుళ్లిపోయిన అస్తిపంజరాన్ని చూసి అంతా షాక్ అయ్యారు.

ఇక 24 గంటల కంటే ముందే ఆ శవం ఎవరితో తేల్చేసారు పోలీసులు. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలోని పాండు అనే వ్యక్తిగా గుర్తించారు. అస్తిపంజరం మీదున్న ప్యాంట్, షర్ట్, బెల్ట్ ఆధారంగా పాండు కుటుంబసభ్యులు ఆయన్ని గుర్తుపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కింద పాండు కనిపించకుండా పోయాడు. అప్పటికే అన్నయ్య కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోవడంతో బాగా మనస్తాపానికి గురయ్యాడు పాండు. పైగా ఆర్థిక పరిస్థితి బాగోలేక తన వ్యవసాయ భూమిని కూడా అమ్మాల్సి రావడంతో తీవ్ర మనోవేదన చెందాడని చెబుతున్నారు గ్రామస్తులు. అదే సమయంలో తన భూమి పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు పోలీసులు. అది నాగార్జున పొలం కావడంతో విషయం హైలైట్ అయింది. పాండు అస్తిపంజరం పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యడు మళ్లీ తిరిగి వస్తాడనుకున్నాం కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అసలు అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు పాండు సన్నిహితులు.

Related posts