హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ను ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ… వసంత పంచమి నాడు స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో భాగం అయిన వారిందరికి అభినందనలు తెలిపారు.
గత 50 ఏళ్లుగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలను ప్రధాని అభినందించారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని ఆకాంక్షించారు.
వ్యవసాయాన్ని అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్ ఎంతో శ్రమించిందని, ప్రకృతి సాగుకు, డిజిటల్ విధానంలో వ్యవసాయ విధానాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. సాగులో ఆధునికత తీసుకువచ్చేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు.
రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని చెప్పారు. పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని.. నిల్వ వసతులు పెంచుతామని అన్నారు. ఈ బడ్జెట్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నామన్నారు
భారత్లో 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి. దేశంలో 170 కరువు జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, బడ్జెట్లో సేంద్రీయ సాగుకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా రైతులకు తోడ్పాటునివ్వాలని చెప్పారు. దేశంలో 80 శాతం మంది సన్నకారు రైతులే ఉన్నారని.. అందరికీ కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
దేశంలో నదుల అనుసంధానాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగకరంగా.. నీటి వనరులను అభివృద్ధి చేయనున్నామన్నారు. దేశంలో వాతావరణంలో కలుగుతున్న మార్పులు.. చిన్న రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.
ఏపీ, తెలంగాణ పంటల దిగుబడి గణనీయంగా ఉంది. పంటకాలం తక్కువ ఉండే మరిన్ని వంగడాలు సృష్టించాలి. వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలను సృష్టించాలని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.భారత్లో 6 రుతువులు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని పీఎం మోదీ పేర్కొన్నారు.
దేశంలో ఆహార ధాన్యాలు సరిపడా ఉన్నాయని, న్యూట్రిషన్ సెక్యూరిటీపై దృష్టి పెట్టామని తెలిపారు. డిజిటల్ వ్యవసాయం అన్నది భారత భవిష్యత్తుగా ప్రధాని మోడీ చెప్పారు. నైపుణ్యం ఉన్న యువత.. ఈ దిశగా అడుగులు వేయాలని మోదీ పిలుపు నిచ్చారు.