దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. పెన్షన్లను తగ్గించాలన్న ఆలోచన చేయడంలేదని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్ర నష్టాల్లో ఉందని, దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై కోత విధిస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఈ విషయం డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) దృష్టికి వచ్చింది. పెన్షన్లలో కోత ఉంటుందని, పెన్షన్లను నిలిపివేయవచ్చని పెన్షన్ దారుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే, పెన్షనర్లు నష్టపోయే చర్యలను కేంద్రం తీసుకోవడంలేదు. 20 శాతం కోత ఉంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ తన ట్విట్టర్లో పేర్కొన్నది.