ఇసుక కొరతతో రాష్ట్రంలో లక్షల మంది కార్మికులు పనులు కోల్పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనతీరును ఎండగట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల తమ కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని ఇసుక లారీల యజమానులు చెబుతున్నారని పవన్ తెలిపారు. అర్ధరాత్రి పూట ఇసుక ఆన్ లైన్ బుకింగ్ ఎందుకు అని ప్రశ్నించారు.
ఇసుక కొరత లక్షల మంది కార్మికులను పనులకు దూరం చేసిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ఉద్యోగ, ఉపాధి కల్పన చేయాలి కా నీ, ఉన్న ఉద్యోగాలను ఊడకొట్టకూడదని చెప్పారు. ప్రభుత్వ పరిపాలన తీరు బాధ కలిగిస్తోందని అన్నారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. అక్కడ రాజధాని కడతారా? లేదా? అన్నది ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.