జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలు తిరోగమనంలో ఉన్నాయని, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన కల్యాణ మండపాలు ఇప్పుడు భద్రతా దళాలకు బ్యారట్లుగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అలాగే, ఇక్కడ కొత్తగా బంకర్లు నిర్మిస్తుండడాన్ని కూడా తప్పుబట్టారు.
తన ప్రభుత్వం హయాంలో కమ్యూనిటీ, మ్యారేజ్ హాళ్లు నిర్మించిందని, శ్రీనగర్ లోని బంకర్లను ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. అయితే, ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ప్రభుత్వ చర్యలను నిందించారు. ప్రజలను ఊపిరి ఆడకుండా చేసే ఏకైక ఉద్దేశంతో ప్రతిరోజూ మరింత క్రూరమైన చట్టాలను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.