telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

“ఎన్ .టి .ఆర్ . మాకు దేవుడు ” – కె . పద్మనాభయ్య

నందమూరి తారక రామారావు గారు తెర మీద పోషించిన శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , శ్రీవెంకటేశ్వర స్వామి , శివుడు , మహా విష్ణువు పాత్రలతో ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారని, తాను కూడా రామారావు గారిని అదే దృష్టి తో చూస్తానని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి కే. పద్మనాభయ్య తెలిపారు .
ఎన్ .టి .ఆర్ శత జయతి వేడుకల్లో భాగంగా కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ , ఎన్ .టి .ఆర్ . ఇంటర్నేషనల్ క్యారికేచర్ , పోయెట్రీ అవార్డులు మరియు సేవ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని జింఖానా లో ఆదివారం నిర్వహించారు . ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పద్మనాభయ్య పాల్గొన్నారు . రామారావు గారు నటుడుగా , రాజకీయ నాయకుడుగా చరిత్ర సృష్టించారని , తెలుగు జాతికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయుడని చెప్పారు .


మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇన్ కం టాక్స్ కమీషనర్ జీవన్ లాల్ మాట్లాడుతూ – ఈరోజు ఇలా కమీషనర్ గా ఉన్నానంటే అది రామారావు గారు పెట్టిన భిక్షే . అప్పుడు వారు గురుకుల పాఠశాలలు ప్రారంభించడం వల్లనే , ఆర్ధిక స్తోమతు లేని నేను అక్కడ చదివానని ఆయన చెప్పారు . తెలుగంటే నాకు ఎంతో మక్కువ , తెలుగు భాషకు , సంస్కృతికి రామారావు గా చేసిన కృషి అనన్య సామాన్యమని జీవన్ లాల్ చెప్పారు . మధ్య యుగాల నాడు కృష్ణదేవరాలయాలు తెలుగు భాషకు ఎంతో సేవ చేశారని , మళ్ళీ శతాబ్దాల తరువాత రామారావు గారు తెలుగు వల్లభుడుగా కీర్తిగాంచారని చెప్పారు .
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ , రామారావు గారు నివసించిన నిమ్మకూరులోనే తమ కుటుంబం ఉండేదని , అదే ప్రాంగణంలో తాము కూడా వుండేవారిమని , వారి గొడ్లసావడి లోనే తాను జన్మించానని చెప్పారు . రామారావు గారి స్ఫూర్తి తోనే తాను కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు . గజల్ శ్రీనివాస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు . ఈ తరం పెద్ద వారిని గౌరవించాలని , నేడు ఫాదర్స్ డే సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం తో పాటు ఆప్యాయంగా చూసుకోవాలని చెప్పారు .
ఎన్ .టి .ఆర్ . సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ సభ్యులు అట్లూరి నారాయణ రావు , భగీరథ అతిధులకు , తమ కమిటీ ప్రచురించిన :శకపురుషుడు “, “ఎన్ .టి .ఆర్ .శాసన సభ ప్రసంగాలు”, “ఎన్ .టి .ఆర్ .చారిత్రిక ప్రసంగాలు”, పుస్తకాలను బహుకరించారు .
కలయిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేరాల నారాయణ రావు , పద్మనాభయ్య , జీవన్ లాల్ , రాజేంద్ర ప్రసాద్ ద్వారా ఇంటర్నేషనల్ క్యారికేచర్ , పోయెట్రీ అవార్డులు ప్రదానోత్సవం చేశారు . భగీరథ , అట్లూరి నారాయణ రావు , స్వామి, మిమిక్రి రమేష్ తదితరులను ఎన్ .టి .ఆర్ .సేవా పురస్కారాలతో సత్కరించారు
కార్యక్రమానికి ముందు మిమిక్రి రమేష్ వివిధ వ్యక్తుల కంఠాలను అనుకరించారు .

Related posts