సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి నరేంద్రమోదీ కేబినెట్లో స్థానం దక్కింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ వచ్చింది. మంత్రిగా ప్రమాణం చేయడానికి ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్కు రావాలని చెప్పారు. కిషన్రెడ్డికి మంత్రి పదవి రావడంతో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి అనుచరులు నిన్నటి నుంచే ఢిల్లీలో ఉండి తమ నేతకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డికి రాజకీయ అనుభవం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడుగా పనిచేశారు. తర్వాత తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఆయనకు మోదీ మంత్రి పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నరేంద్రమోదీ తన మంత్రివర్గంలోకి 60 మందిని తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీనియర్లతో పాటు అనేకముంది కొత్త ముఖాలకు ఈసారి అవకాశం లభించనుంది. రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న మోదీ ప్రమాణస్వీకారానికి 8వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు.