బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ కు ఎన్సీబీ నోటీసులు అందాయి. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇక వీరితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కు నోటీసులు అందాయి. అయితే రకుల్కు ఎలాంటి నోటిసులు అందలేని ఆమె టీమ్ మొదట ప్రకటించింది. హైదరాబాద్లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్సీబీ పంపిన సమన్లు అందలేని రకుల్ ప్రీత్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు.
అయితే, రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ ఇచ్చిన ప్రకటనను ఎన్సీబీ ఖండించింది. ఆమె సమన్లు అందినట్టు ఎన్సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్ర గురువారం వెల్లడించారు. “రకుల్ ప్రీత్ సింగ్కు సమన్లు జారీ చేశాం. అంతేకాకుండా, ఆమెను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అలాగే, పలు ప్లాట్ఫాంల ద్వారా కూడా ఆమెను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. కానీ, ఆమె అందుబాటులోకి రాలేదు. ఆమె నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు” అని మల్హోత్ర అన్నారు. అంతేకాకుండా రకుల్ ప్రీత్ తమని తప్పుదారి పట్టిస్తున్నారని, ఆమె హైదరాబాద్లో ఉన్నారా లేక ముంబైలో ఉన్నారా అనే విషయం తమకు తెలియదని ఎన్సీబీ అధికారి అన్నారు. ఒకవేళ రకుల్ రేపు విచారణకు హాజరుకాకపోయినా, ఏవైనా సాకులు చెప్పినా ఆమెకి నాన్ బెయిలబుల్ సమన్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ఎన్సీబీ నుంచి హెచ్చరిక రాగానే రకుల్ ప్రీత్ సింగ్ మాట మార్చారు. తనకు సమన్లు అందలేదంటూ ప్రకటన విడుదల చేసిన రకుల్ ఇప్పుడు అందాయని ప్రకటించారు. ఆమె రేపు (సెప్టెంబర్ 25న) విచారణ హాజరయ్యే అవకాశం ఉంది. గురువారం ముంబైలోని రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సమన్లు పంపినా సమాధానం లేకపోవడం, ఈరోజు విచారణకు హాజరుకాకపోవడం వల్లే ఎన్సీబీ అధికారులు రకుల్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఇక వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది.