విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్లో దర్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. అయితే.. జగన్ లేఖ రాయడంపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుందని.. సీఎం జగన్ కొంటున్నారని ఫైర్ అయ్యారు లోకేష్. లేఖలతో జగన్ పిరికి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. “విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తుంది. సీఎం జగన్ కొంటున్నాడు. ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 28 మంది ఎంపీలు ఎందుకు దండగ. ప్రజల హక్కులు కాపాడలేని వారు ఎంత మంది ఉండి ఉపయోగం ఏంటి? విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరు చెప్పి లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం, వైకాపా నాయకుల డ్రామాలు ఆపాలి.” అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
previous post
next post