అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఎటువంటి విచారణకైనా తాము సిద్దంగా ఉన్నానని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈరోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి తెచ్చిన అసెంబ్లీ సామాగ్రిలో కొంత భాగం తన సత్తెనపల్లి ఆఫీసుకు చేరిన విషయం నిజమేనని తెలిపారు. వాటిని తీసుకెళ్లాలని తాను రెండుసార్లు లేఖ రాసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇప్పుడు తాను సెల్ ఫోన్లను, మందులను కూడా అమ్ముకున్నట్టుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏపీ అసెంబ్లీ తనకు దేవాలయం వంటిదని, ఐదేళ్లపాటు తాను కేవలం పూజారిలా మాత్రమే పని చేశానని కోడెల వ్యాఖ్యానించారు. తాను ఏం చేసినా, నిబంధనల ప్రకారమే చేశానని స్పష్టం చేశారు. గెలిచిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందించకుండా విపక్షంపై వేధింపులు సరికాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని, ఎల్లకాలమూ సీఎం పీఠంపై ఉంటానని జగన్ కలలు గంటున్నారని మండిపడ్డారు.