తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఎడమొహం పెడమొంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఒకే ఫ్రేములో కనిపించారు. మంగళవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
గతంలో రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో తన ఇంటికి ఎవరూ రావొద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఇటీవల యాదాద్రి పర్యటనలోనూ కేసీఆర్తోనూ సన్నిహితంగా ఫొటోలు దిగారు. దీంతో కోమటిరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ ఆదేశాల మేరకు యూపీఏలోని భాగస్వామ్య పక్షాలను చీల్చి బీజేపీకి అనుకూలం చేసేందుకే కేసీఆర్ పూనుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న మమత బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ ను కలిసి కొత్త ఫ్రంట్ పెట్టాలని చూస్తున్నాడన్నారు.
కేంద్రంలో మోడీ సర్కార్ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారే ఒక్కటే నినాదంతో పనిచేస్తున్నాయని, కేసీఆర్ మోడీ కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను నమ్మే ప్రసక్తే లేదని, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటికీ కలవబోవని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్కు కేటీఆర్ చొరవ చూపాలని సూచించారు. ఆ తర్వాత 3 రోజులు కాకుంటే వారం వేడుకలు జరుపుకున్న అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు.
మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ రేవంత్ రెడ్డి.. హ్యాఫీ టైమ్స్ అని పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డితో భేటీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘ఈరోజు నా నివాసంలో నా సహచర ఎంపీ రేవంత్ రెడ్డిని కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం. ఈ ఫొటోలు రాజకీయ వర్గాల్లో వేడి పెంచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అందరం కలిసి తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
Happy times…. pic.twitter.com/kWBspwDdBA
— Revanth Reddy (@revanth_anumula) February 15, 2022
మాకు ప్రతిపక్షం..స్వపక్షం ఏమీ ఉండవు..మాకు అంతా సమానమే..