మహిళల ఆదరణ వల్లే టీడీపీ మరోసారి ఏపీలో అధికారంలోకి రాబోతోందని టీడీపీ నేత, లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలతో కలిసి ఈరోజు ఢిల్లీకి చేరుకున్న దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీ గెలుస్తుందన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కులపిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్ కు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలితో పాటు ఈవీఎంల సమస్యను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తాము ఢిల్లీకి వచ్చామని జేసీస్పష్టం చేశారు. ఎన్నికల్లో నల్లధనం, అవినీతిని నిరోధించాలని ఈసీని కోరతామన్నారు. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ క్వీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.