ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కక్షతోనే ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు.
వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లాలో కాలేజీమిట్ట కు చెందిన చెంచుక్రిష్ణ అనే యువకుడు గత కొన్ని రోజులుగా చిగురుపాటి జ్యోతిక(18) ను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. తరచూ తను చదివే కళాశాల దగ్గరకు వెళ్లి తన ప్రేమను ఒప్పుకోవాలంటూ ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నాడు.
అయితే అతడి ప్రేమను అంగీకరించని యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపగా వారు కృష్ణను మందలించారు. తమ కూతురి జోలికివస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు
తన ప్రేమను ఒప్పుకోవడం లేదన్న కారణంతో జ్యోతికపై కక్ష పెంచుకున్నాడు కృష్ణ. ఈవేళ ఏకంగా ఇంట్లోకే చొరబడిమరీ నిద్రిస్తున్న జ్యోతిపై కత్తితో గొంతు కోశాడు. అనంతరం కల్లు కాంపౌండ్కు వెళ్లి కల్లు తాగి ఇంటికి వెళ్లాడు.
కేకలు వేస్తూ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కేకలు విన్న స్థానికులు తలుపులు పగులకొట్టి యువతిని ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం జ్యోతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా విద్యార్థినిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.