లోక్ సభ ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్ లో బీజీపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇప్పటికే ఇరు పార్టీల కార్యకర్తలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఇటీవల వ్యాఖ్యానించారు.
గవర్నర్ కేసరినాథ్ వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. కోల్ కతాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం మమతా మాట్లాడుతూ బెంగాల్ ను గుజరాత్ గా మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. బెంగాల్ ఎన్నటికీ గుజరాత్ కాదని మమతా స్పష్టం చేశారు. నేను గవర్నర్ ను గౌరవిస్తాను. కానీ ప్రతీ పదవికి రాజ్యాంగబద్ధమైన హద్దు అనేది ఉంటుందన్నారు. బెంగాల్ ప్రతిష్టను కొందరు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.