తమ రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపించవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఆంఫన్ తుపాను సహాయక చర్యల్లో అధికారులందరూ నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 26 వరకు శ్రామిక్ రైళ్లను పంపించవద్దని రైల్వే మంత్రికి విన్నవించారు.
తుపాను పునరావాస చర్యల్లో జిల్లాల అధికార యంత్రాంగమంతా బిజీగా ఉన్నారని తెలిపారు. దీంతో కొన్ని రోజుల పాటు శ్రామిక్ రైళ్లను రీసీవ్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని దీదీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ సిన్హా కూడా రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ కు లేఖ రాశారు. తుపాను వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు శ్రామిక్ రైళ్ల విషయంలో గతంలో మమతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. కరోనా సమయంలో వలస కార్మికులు బెంగాల్ కు తిరిగి రావడం మమతకు ఇష్టం లేదని, అందుకే శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదని దుయ్యబట్టారు.