మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ కూటమి ఇవాళ బలనిరూపణలో విజయం సాధించింది. ఈ మూడు పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు బల పరీక్ష నిర్వహించగా ఉద్దవ్ ఠాక్రే నెగ్గారు. ఉద్ధవ్ థాకరే సర్కారుకు అనుకూలంగా 169 ఓట్లు పడ్డాయి. బల పరీక్ష సమయానికి సభలో ఉన్న ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా, నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
బలపరీక్షకు ముందే 105 మంది బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని మాజీ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ నియామకం అనైతికంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఇవాళ సభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన తర్వాత జరిగిన ఓటింగ్లో ఉద్దవ్ ప్రభుత్వం విజయం సాధించింది.