ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శల పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం రాజ్యాంగం ప్రకారం జరిగిందన్నారు. దీన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.
గతంలో వైసీపీ నేతలను టీడీపీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీకి చెందిన నేతలకు ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.