telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మోడీకి మద్దతుగా .. కేజ్రీవాల్ వ్యాఖ్యలు.. జాతీయభావం..

Delhi

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మా దేశ వ్యవహారాల్లో మీ జోక్యమెంటంటూ పాక్ మంత్రిపై మండిపడ్డారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోడీకి బుద్ధి చెప్పాలని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి ట్విట్టర్ వేదికగా ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చాడు. కాశ్మీర్ అంశం, పౌరసత్వ సవరణ చట్టంపై బాహ్య ప్రపంచం నుంచి వస్తున్న విమర్శలు, ఆర్థిక మందగమనం మోడీకి మతిచలించిందని, అందుకే అర్థంలేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ఫవాద్ పేర్కొన్నారు.

దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఇందులో ఇతరులు తలదూర్చాల్సిన అవసరం లేదని పాకిస్థాన్ మంత్రికి అరవింద్ కేజ్రీవాల్ చురకలు అంటించారు. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి. ఆయన నాకు కూడా ప్రధానమంత్రే. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత విషయం. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారి జోక్యాన్ని మేము అస్సలు సహించం. భారత ఐకమత్యానికి హాని తలపెట్టాలని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదు’ అంటూ పాక్ మంత్రికి కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ ట్వీట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. కేజ్రీవాల్ హుందాగా వ్యవహరించారని కొందరు నెటిజన్లు పేర్కొనగా.. మరికొందరు ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఇలా చేస్తున్నారంటూ విమర్శించారు.

Related posts