గ్రామ వలంటీర్ల పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఘాటుగా స్పందించారు. గ్రామ వలంటీర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు. గ్రామ వలంటీర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.
అంతేకాకుండా, బోయాలమ్మ అనే మహిళా వలంటీర్ ఓ అనాథను 108 వాహనంలోకి ఎక్కిస్తున్న ఫొటోలను ట్వీట్ చేశారు. స్పృహ కోల్పోయిన ఓ అనాథను ధర్మసాగరం గ్రామ వలంటీర్ బోయాలమ్మ చేరదీసిందని, చికిత్స కోసం అతడిని 108 వాహనంలో ఎక్కించడాన్ని చూడాలని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లు ఇలాంటి గొప్ప మనసున్న వాళ్లు అని పేర్కొన్నారు. అలాంటివారిపై చంద్రబాబునాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నొచ్చుకునే విధంగా ఉన్నాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.