తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పర్యటించి, వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ ఘాటుగా స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక్క చింతమడక ప్రజలకే సీఎం కాదని, అన్ని గ్రామాలనూ సమానంగా చూడాలంటూ హితవు పలికారు. గత సీఎంలను సొంత గ్రామాలను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని విమర్శించిన కేసీఆర్ నేడు చింతమడకలా ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారో చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.
చింతమడకలో ఒక్కో ఇంటికి రూ.10 లక్షల లబ్ది చేకూరుస్తానని కేసీఆర్ అనడం సరికాదన్నారు. నేటి వరకూ రాష్ట్రంలో చాలా మందికి రైతు బంధు నగదే అందలేదని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సైతం కేసీఆర్ విస్మరించారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల నిధులను కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రం కేటాయిస్తూ తనను ఎంపీగా గెలిపించిన పాలమూరును మాత్రం సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.