ఏపీ సీఎం జగన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసల జల్లు కురిపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు జగన్ కొద్ది సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు జాతీయస్థాయిలో వినిపిస్తోందని తెలిపారు.
జగన్ కు ఇంత పేరు రాకుండా ఎలా అడ్డుకోవాలంటూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధాన్ని సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి నిష్క్రమించిన నేపథ్యంలో, జగన్ ఎలా నెట్టుకొస్తాడోనని సందేహాలు వచ్చాయని, కానీ మేధావులు సైతం ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని తెలిపారు. వైసీపీ పాలన పట్ల ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.