ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. సీఎం విపక్షాలపై కక్షసాధింపు చర్యలు పక్కనబెట్టి, రాష్ట్రపాలనపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని అమరావతిలో పర్యటించగా, ఆయన కాన్వాయ్ పై దాడి ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు.
రాజధాని పర్యటనలో చంద్రబాబుపై దాడి చేయించింది ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతపై దాడి చేసిన వారిని వదిలేసి, బస్సును సీజ్ చేయడమేంటని నిలదీశారు. దర్యాప్తు పేరుతో తొమ్మిదిరోజుల పాటు బస్సును వారి అధీనంలో ఉంచుకుని, బస్సు యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా బస్సును యాజమానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.