telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్ మైన‌ర్ బాలిక రేప్‌ కేసు ఏ-1 నిందితుడికి 3 రోజుల కస్టడీ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.ఈ నెల 9 నుంచి 11 వరకు కస్టడీలోకి అనుమతినిచ్చింది.

ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సాదుద్దీన్‌ను.. రేపటినుంచి జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. కాగా బాలికపై రేపు ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒక‌రు మేజ‌రు, ఐదుగురు మైన‌ర్లు.

ఇందులో సాదుద్దీన్‌(18) ప్రధాన నిందితుడు(ఏ-1)గా ఉన్నాడు. మిగిలిన ఐదుగురు మైనర్లను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు జువైనల్‌ జస్టిస్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించిన విచారణ ఇంకా జరగాల్సి ఉంది.

నాంపల్లి కోర్టులో సాదుద్ధీన్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు కోరినప్పటికీ.. మూడు రోజులే కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు.

అయినప్పటికీ ప్రధాన నిందితుడు సాదుద్ధీన్‌ కాబట్టి.. ఇతను మైనర్లను ఏవిధంగా ప్రోత్సహించాడు? అస‌లు ఎంతమంది పాత్ర ఇందులో ఉంది? బాలికను ఎలా మభ్యపెట్టి వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు? తదితర విషయాలను అతని నుంచి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ ముగిసిన అనంతరం నాలుగో రోజు ఉదయం 10 గంటలకు సాదుద్ధీన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్‌కు తరలించనున్నారు.

Related posts