మన హీరోలు రీల్ మీద కాదు..రియల్ గా కూడా హీరోస్ అని మరోసారి నిరూపించుకున్నారు.అభిమానులు లేనిదే హీరోలు లేరనేది వాస్తవమే అయినా.. ఆ మాటకు విలువనిచ్చే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.
ఎన్టీఆర్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గోంటూ తన వంతు సహాయాన్ని అందిస్తుంటాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. ఆపదలో ఉన్న అభిమానులకు ఎప్పుడు అండగా నిలుస్తుంటాడు. అలాగే ఎన్టీఆర్ సైతం తన అభిమానుల కోరికలను తీర్చడంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీరుస్తూ.. వారిని వారికి సర్ ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి తన అభిమానికి కోరిక తీర్చాడు యంగ్ టైగర్.
ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసి పరామర్శించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ.. జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. ఇటీవల ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడం వల్ల విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి.. తన చివరి కోరికగా.. జూనియర్ ఎన్టీఆర్ను కలవాలని వైద్యులకు చీటి రాసి చూపించాడు. ఆ విషయాన్ని వైద్యులు.. మురళీ బంధువులకు చెప్పారు. ఈ విషయాన్ని యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు ఎన్టీఆర్. తనను ఎంతగానే ప్రేమిస్తున్న తన అభిమానికి ఇలా జరగడం తనను కలచివేసిందని చెప్పారు.
వీడియో కాల్లో మురళీతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మురళీ బయటకు వస్తాడని ఆకాంక్షించారు. తన అభిమాన కథానాయకుడు వీడియో కాల్ చేయడంతో మురళీ ఉప్పొంగి పోయాడు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానంటూ సైగలతో ఎన్టీఆర్కు వివరించారు.అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్.