లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనతో చెలరేగిన రాజకీయ వివాదం ఉత్తర ప్రదేశ్ను హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీ మరణించిన రైతుల కుంటుంబాలను బుధవారం కలిసారు. వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్తో పాటు కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, దీపీందర్ సింగ్ హుడా ఉన్నారు.
లఖింపుర్ ఖేరి ఘటనలో భాదిత రైతు కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం కొనసాగుతుందని, బాధితులకు ‘పరిహారం ఇవ్వడం కాదు న్యాయం జరగాలి’ అని డిమాండ్ చేశారు. “ప్రజాస్వామ్యంలో న్యాయం పొందడం ఓ హక్కు. న్యాయం కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను అని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను నిన్న కలిసినప్పుడు వారంతా న్యాయం కావాలని మాత్రమే కోరారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.”
తాజాగా ప్రతిపక్షాల ఒత్తిడి మధ్య ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లఖీమ్పూర్ ఘటనను విచారించడానికి రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవతో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం ఈ కమిషన్ తన విచారణను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరొ కొన్ని నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లఖీమ్పూర్ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే లఖీమ్పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది.