telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అసలేం జరిగిందంటే… ప్రమాదంపై జీవితరాజశేఖర్ వివరణ

Jeevita Rajasekhar

టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రాజశేఖర్ చిన్న చిన్న గాయలతో బయటపడ్డారు. తాను క్షేమంగా ఉన్నానంటూ రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది?.. కారణం ఏమిటి? అనే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు రాజశేఖర్ సతీమణి జీవిత మీడియా ముందుకు వచ్చారు. అసలేం జరిగిందో వివరించారు. “రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందనే వార్త చూసి ఆయనకు ఏమైందోనని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో అందరికీ చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కానీ, అసలు జరిగింది ఏమిటంటే.. నిన్న రాత్రి 1.30 గంటలకు రామోజీఫిలిం సిటీ నుంచి రాజశేఖర్ గారు ఇంటికి వస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు టైర్ పగిలి కంట్రోల్ తప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ కారు ఆగి, అందులో ఉన్నవాళ్లు దిగి చూసి రాజశేఖర్ గారిని గుర్తుపట్టి సాయం చేశారు. వాళ్ల ఫోన్ నుంచే పోలీసులకు, మాకు జరిగింది చెప్పారు. వాళ్ల కారులోనే సగం దూరం వచ్చారు. మేము ఎదురు వెళ్లి పికప్ చేసుకున్నాం. ఆ తర్వాత నేను పోలీసులకు ఫోన్ చేసి అన్ని వివరాలు చెప్పాను. రాజశేఖర్ గారి వస్తువులన్నీ వెరిఫై చేశాక.. రాజశేఖర్ గారు క్షమమే కదా అని ఒకటికిరెండు సార్లు అడిగారు. ఆయనతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి ఆయనను చూశారు. ఒక చిన్న గాయం తప్ప ఎలాంటి బలమైన గాయాలు కాలేదని చెప్పారు. దానికి చికిత్స చేసి ఆయన వెళ్లి పోయారు. ఆ తర్వాత కూడా నేను పోలీసులతో టచ్‌లో ఉన్నా. సీఐ వెంకటేశ్వరరావుగారితో మాట్లాడాను. జరిగిన ఘటనపై స్టేషన్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు. రాజశేఖర్ గారు కోలుకున్నాక వీలు చూసుకుని రమ్మన్నారు. తప్పకుండా వస్తామని చెప్పాము. జరిగింది ఇదీ. నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం. కానీ, రాజశేఖర్ గారిని అభిమానించే అందరి ప్రేమ వల్లే ఆయన క్షేమంగా బయటపడ్డారు. మీ అందరి ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు” అని జీవిత పేర్కొన్నారు.

Related posts