telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల

exam hall

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విజయవాడ హోటల్ గేట్ వేలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఫలితాలను విడుదల చేశారు. దీనిపై మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ దేశం మొత్తం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో ఏపీ మాత్రమే ఓ పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించగలిగిందని అన్నారు. మరే రాష్ట్రం ఇంటర్ ఫలితాలు వెల్లడించలేకపోయిందని చెప్పారు.

లాక్ డౌన్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సుమారు 60 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించడం మామూలు విషయం కాదని చెప్పారు. అందుకే ఇవాళ చారిత్రాత్మకమైన దినంగా భావిస్తున్నామని తెలిపారు. ఫలితాలు చూసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈసారి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరయ్యారని, వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, పాస్ శాతం 59 అని మంత్రి వివరించారు. సెకండియర్ పరీక్షలకు ఈసారి 4,35,655 మంది హాజరయ్యారని, వారిలో పాసైంది 2,76,389 మంది అని, పాస్ శాతం 63 అని తెలిపారు. ఫలితాలను bie.ap.gov.in, manabadi.com, rtgs.ap.gov.in, results.apcfss.in వెబ్ సైట్లలో వీక్షించవచ్చు.

Related posts