భారత జట్టు కు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన మాట వాస్తవం. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్స్లో రవిశాస్త్రి మునిగితేలుతున్నాడు. ఈ సందర్భంగా అతడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నటి రవీనా టాండన్, వ్యాపారవేత్త గౌతమ్ సింగానియాలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోకు కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా.. మరికొంత మంది రవిశాస్త్రికి న్యూఇయర్ విషెస్ తెలుపుతున్నారు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం రవిశాస్త్రి షేర్ చేసిన ఫోటోకు లైక్ కొట్టి న్యూఇయర్ విషెస్ తెలిపాడు.
అంతకముందు రవిశాస్త్రి ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు. 2019లో అద్భుతంగా రాణించారని, అదేవిధంగా 2020లో వచ్చే సరికొత్త సవాళ్లకు సిద్దంగా ఉండాలని సూచించాడు. విరామ సమయాన్ని ఎంజాయ్ చేయండి, 2020లో కలుద్దామంటూ ట్వీట్ చేశాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి మినహా మిగతా అన్ని సిరీస్ల్లోనూ కోహ్లి సేన అదరగొట్టింది. రానున్న ఏడాదిలో టీమిండియాకు అతిపెద్ద సవాల్ టీ20 ప్రపంచకప్ రూపంలో ఎదురుకానుంది. ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్ సిరీస్ ముగిశాక టీమిండియా క్రికెటర్లకు స్వల్ప విరామం లభించింది. దీంతో ఈ గ్యాప్లో క్రికెటర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది.