భారత్- చైనా మధ్య నెలకొన్న వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాను భారత ప్రజలతో పాటు చైనా ప్రజలనూ ఇష్టపడతానని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఉండడానికి అవసరమైన ప్రతి పని చేస్తానని అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెకనీ మీడియాకు తెలిపారు.
భారత్-చైనా దేశాల గురించి వైట్ హౌస్ ఆర్థిక సలహాదారుడు లారీ కుడ్లో కూడా మీడియాతో మాట్లాడారు. తమ దేశానికి భారత్ అతిపెద్ద ఆర్థిక భాగస్వామి అని తెలిపారు. చైనాతో భారత్కు పొంచి ఉన్న ముప్పుపై తాము చర్చించామని అన్నారు.అమెరికా జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ఓబ్రియెన్ మాట్లాడుతూ భారత్ విషయంలో డ్రాగన్ దేశం దుందుడుకుగా వ్యవహరిస్తోందని అన్నారు.