మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ని కొట్టివేయాలని అనిల్ కుమార్ ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది హైకోర్టు. కాగా.. గ్రేటర్ ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. జీహెచ్ఎంసీ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపే తేలనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం వరకే ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా… మరిన్ని చోట్ల రిజల్ట్స్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సిద్ధమవుతున్నారు.