ఇటీవల లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడటంతో ప్రేక్షకులు కాస్త ఆందోళన చెందారు. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన బాల సుబ్రహ్మణ్యం.. ప్రస్తుతం చెన్నైలోని చులైమెడులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. నిజానికి బాలుకు ఆసుపత్రిలో చికిత్స అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ చాలని వైద్యులు చెప్పినప్పటికీ.. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, శరీరానికి కావాల్సినంత ఆక్సీజన్ చక్కగా అందుతోందని ఈ హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. త్వరలోనే ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశార్జ్ చేయనున్నారని సమాచారం. దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా కరోనా బారిన పడుతున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అమితాబ్ బచ్చన్, రాజమౌళి, విశాల్, నిర్మాత బండ్ల గణేష్ లాంటి ప్రముఖులు కరోనా బారినపడి కోలుకున్నారు.
previous post