ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కులాభిమానం చాలా ఎక్కువని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ద్వారా నియోజకవర్గంలోని కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.
జనసేన కులాభిమానంతో, బీజేపీ మతాభిమానంతో కుళ్లిపోయాయని హర్షకుమార్ మండిపడ్డారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని, ఆ నియోజకవర్గానికి జనసేన రెబల్ రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు. అందుకే జనసేన, బీజేపీలు అంతర్వేది ఘటనను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడమే సోము వీర్రాజుకు లక్ష్యమని అన్నారు. చిరంజీవి కుటుంబానికి ఆయన హనుమంతుడిలా మారిపోయారని చెప్పారు.సీఎం జగన్ పై కూడా హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కోలా జగన్ నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను ఒకేలా చూడరని విమర్శించారు.