మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పలువురి మద్దతు లభిస్తోంది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ బిఎస్ కొశ్యారీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఘటనపై కేంద్రానికి ఆయన నివేదికను పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర సీఎంను అవమానించిన కంగనపై పరువు నష్టం దావా వేసే ఆలోచనలో ఉన్నట్లు నగరానికి చెందిన నితిన్ మానే అనే న్యాయవాది తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా ముంబైలోని తన కార్యాలయ భవనంలో కొంత భాగాన్ని బృహన్ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన ఘటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే పై నటి కంగన రనౌత్ మండిపడ్డారు. “మీ తండ్రిగారి మంచి పనులు మీకు సంపదను ఇస్తాయేమో.. మంచి పేరును మాత్రం మీరే సంపాదించుకోవాలి. మీరు నా గొంతు నొక్కితే.. కోట్లాది గొంతుకలుగా అది ప్రతిధ్వనిస్తుంది. మీరు ఎన్ని నోళ్లు మూయగలరు? ఎంతమందిని అణిచివేయగలరు? నిజాలకు దూరంగా పారిపోయే మీరు రాచరిక పాలనకు సరైన ఉదాహరణ. అధికారం కోసం శివసేనను సోనియా సేనగా మార్చేశారు. నా వెంట నిలుస్తున్న కోట్లాది మందికి నా ధన్యవాదాలు. ఎంతోమంది మరాఠీ స్నేహితులు నాకు ఫోన్ చేసి మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. మహారాష్ట్ర సంస్కృతిని ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యలతో మంట కలపొద్దు” అని కంగన మండిపడ్డారు. మహారాష్ట్ర సర్కారుపై కంగన పోరాటం ఒకప్పటి భగత్ సింగ్ను గుర్తు చేస్తోందని తమిళ నటుడు విశాల్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. కంగనతో వివాదం అనే అధ్యాయం ముగిసినట్లు భావిస్తున్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.