హైదరాబాద్ : తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్రావు, కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న హరీష్ రావు కు, అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను సైతం సీఎం కేసీఆర్ అప్పగించారు. ఇప్పటి వరకు ఈ శాఖ ముఖ్య మంత్రి కేసీఆర్ వద్ద నే ఉంది.
అంతకుముందు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఈ శాఖ సీఎం కేసీఆర్ ఖాతాలో చేరింది. ఈటెల రాజేందర్ భూమిని అక్రమంగా ఆక్రమించాడని ఆరోపణలు రావడంతో హుటాహుటిన సీఎం కేసీఆర్, ఈటెలను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఖాళీగా ఉండిపోయింది.
అయితే, కొన్ని రోజులు సీఎం కేసీఆరే ఈ శాఖ ను పరిశీలించారు. సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. తాజాగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు అదనపు బాధ్యత గా వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్య మంత్రి కేటాయించారు. ఇకపై హరీష్ రెండు శాఖల బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.