లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏదో ఒక సాకుతో రోడ్లపైకి వస్తున్నవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ఈ మూడు రోజుల్లో పాతబస్తీ యువకులు వందలాదిమంది రోడ్లపైకి వచ్చారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇకపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వ జీవో 45, 46, 48 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఐపీసీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. ఒకసారి ఈ చట్టాల కింద కేసులు నమోదైతే ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.