*వైసీపీ కండువా కప్పుకున్న మంగళగిరి టీడీపీలో కీలక నేత గంజి చీరంజీవి
*సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన గంజి చిరంజీవి
* బీసీల్నీ టీడీపీ ఎదగనీయడం లేదు.
మంగళగిరి టీడీపీలో కీలకనేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాలువాతో సత్కరించిన గంజి చిరంజీవి పుష్ఫగుచ్చం అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గంజి చిరంజీవి అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల టిడిపికి రాజీనామా ప్రకటన సమయంలో చిరంజీవి బాగా ఎమోషన్ అయ్యారు. తనను రాజకీయంగా ఎదగనివ్వకుండా టీడీపీలో కొందరు మానసికంగా హత్య చేశారని ఆరోపించారు. బీసీ నేత అయినందునే తనను అవమానించారని చెప్పారు. తన రాజీనామాను ప్రకటిస్తూ మీడియా ఎదుటే చిరంజీవి కన్నీటి పర్యంతం అయ్యారు.
మున్సిపల్ చైర్మన్గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పదవుల కోసం రాజీనామా చేయలేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే రాజీనామా చేశానని అన్నారు.
2019 ఎన్నికల్లో మంగళగిరి టికెట్ ఇస్తానని మోసం చేశారని గంజి చిరంజీవి ఆరోపించారు. మంగళగిరి టికెట్ ఇవ్వకపోవడంతో.. అధికార ప్రతినిధి పదవి ఇచ్చి నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారని చిరంజీవి అన్నారు.