ఏపీసీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర జానపద, కళలు, సృజనాత్మకత అకాడమీ సభ్యులుగా ప్రముఖ రంగస్థల నటుడు, నిర్వాహకుడు, డాక్టర్.చిట్టినేని.శివకోటేశ్వరరావు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గతరాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయబడ్డాయి.
కృషితోనాస్తి దుర్భిక్షం.. అన్నట్టుగా, అప్పటిలో రంగస్థలం నాటకాలతో ప్రజలను అనేక విషయాలపై ఆసక్తికరంగా జ్ఞానాన్ని అందిస్తుంటారు. ఇది సమాజాన్ని నిర్మించడంలో ఎంతో పాత్ర పోషిస్తుంది. అలాంటి బాధ్యతలను భుజాన వేసుకోవడం అనుకున్నంత సులువు కాదు. కానీ, ఇప్పటికి అలాంటివి విధినిర్వహణలా చేస్తున్న వారు ఉన్నారు. కళలతో ఎంతటి వారిలోనైనా చైతన్యం తీసుకురావచ్చని ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించాల్సిన పనికూడా లేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఈ విషయంలో నిష్ణాతుడై, చిట్టినేని బరంపురం విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకరంగ జానపద కళారూపాలు అనే అంశాలపై పరిశోధన చేసి డాక్టరేట్ (గోల్డ్ మెడల్) పొందారు. దీనిపై ఆయన రాసిన గ్రంధానికి రాష్ట్రప్రభుత్వం నంది పురస్కారం ఇచ్చి సత్కరించింది.
ఆయన ప్రాధమికంగా చేసిన వృత్తి విషయానికి వస్తే, విజ్ఞాన్ కళాశాల, గుంటూరు లో 1981-84 వరకు వాణిజ్యశాస్త్ర ఉపన్యాసకులుగా పనిచేశారు. అనంతరం 1984-89 వరకు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ లో పర్యవేక్షకులుగా ఉన్నారు. 1989-2008 వరకు వికాస్ విద్యాసంస్థలలో బాగస్వామిగానే కాకుండా ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షకులుగా ఉన్నారు. 2008-2010 వరకు కాటూరి మెడికల్ కళాశాలలో ఆర్థిక పర్యవేక్షకులుగా ఉన్నారు.
కళారంగంలో కూడా ఆయన 1982 నుండి నేటి వరకు విశేషంగా కృషిచేశారు. 2004 నంది నాటకోత్సవాలలో గంగోత్రి-పెదకాకాని నాటక మండలి ప్రదర్శించిన ‘ఆంబోతు’ నాటిక నిర్వాహకులుగా బంగారు నంది అందుకున్నారు. 2011కు నాటక రంగంలో ఉత్తమ పుస్తక రచయితగా; అదే ఏడాదిలో జరిగిన నాటకోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ వారి నుండి నంది పురస్కారం.
డాక్టర్.చిట్టినేని 2009 లో తానా సంస్థ గుంటూరు లో నిర్వహించిన జానపద కళా ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. ఆయన ఖమ్మం కళాపరిషత్ వారి శ్రీభారతీయుడు పురస్కారాన్ని పొందారు. నంది నాటకోత్సవాలలో బాలల నాటికల విభాగానికి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. గంగోత్రి నాటక సంస్థలో నటుడుగా, నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు లో 2012లో జరిగిన నంది నాటకోత్సవాలకు ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. డాక్టర్.చిట్టినేని జాతీయ మరియు అంతర్జాతీయుల ఆసక్తి మేరకు జానపదాలపై పలు సెమినార్లలో పాల్గొన్నారు.
డాక్టర్.చిట్టినేని ఏపీ జానపద కళలు సృజనాత్మకత అకాడమీ సభ్యులుగా నియమితులైనందుకు డాక్టర్.కందిమెళ్ళ సాంబశివరావు(తెలుగు నాటక అకాడమీ వైస్ ఛైర్మెన్), డాక్టర్.విజయభాస్కర్(రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్), గుమ్మడి గోపాల కృష్ణ(తెలుగు నాటక అకాడమీ చైర్మన్), పొట్లూరి హరికృష్ణ(జానపద అకాడమీ), నాయుడుగోపి(టీవీ, చలనచిత్ర నటుడు) తదితరులు అభినందనలు తెలిపారు.
డా.చిట్టినేని గారికి నవ్యమీడియా, బ్రెయిన్ ఫీడ్ అధినేత కాకాని వీరబ్రహ్మం గారు, ప్రముఖ సినీ నటుడు రాజబాబు గారు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ షికార్లు: కోదండరాం