ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ను ఏర్పాటు చేసి తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసే వారిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మరణించిన తన స్నేహితుడు ప్రసాద్ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు సుకుమార్. ప్రసాద్ మరణించినప్పటికీ నేడు అతని బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన సుకుమార్.. వారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఓ చిన్న కథను రాశారు. తొలుత లేకపోవడం అంటే ఏంటీ అని ప్రస్తావించిన సుకుమార్.. చివరకు తనకు ఆ పదం అర్థమైందని పేర్కొన్నారు. లేకపోవడం అంటే.. మనం ‘ఈ బతుకు’ అనే లాక్డౌన్లో బందీగా ఉండటమే అని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్చగా తిరుగుతున్న ‘బావగాడికి (ప్రసాద్)’ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. కాగా, సుకుమార్కు అత్యంత సన్నిహతుడై ప్రసాద్ మార్చి 28వ తేదీన గుండెపోటుతో కన్నుమూశారు. ప్రసాద్ సుకుమార్ వద్ద మేనేజర్ కూడా పనిచేసేవారు. సుకుమార్ సతీమణి తబిత కూడా ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రసాద్ అన్నయ్య నువ్వు మమల్ని విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయిన నిజాన్ని.. జీర్ణించుకోవడం చాలా కష్టం. నీ స్వచ్ఛమైన చిరునవ్వును మరిచిపోవడమనేది జరగని పని. నిన్ను ప్రతిరోజు మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాం.. మరీ ముఖ్యంగా ఇవాళ నీ పుట్టిన రోజునా. నువ్వు ఎప్పుడూ మా గుండెల్లో ఉంటావు’ అని పేర్కొన్నారు.