మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్కు తమ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి మద్దతు కావాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
అందులో భాగంగా తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడులో బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి పోరాడాలన్న కేసీఆర్ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.
అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోసం కేసీఆర్ తమను వాడుకోవడం లేదని, తామే కేసీఆర్ ను వాడుకుంటున్నామని అన్నారు. తమ్మినేని వీరభద్రం గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో బీజేపీని ఓడించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంటే సీపీఎం పార్టీ వాళ్ళకే మద్దతు ఇచ్చేదని తమ్మినేని చెప్పారు. కాంగ్రెస్ కు ఆ శక్తి లేకపోవడం వల్ల తాము బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ తమకు తోక పార్టీ అని విమర్శించవచ్చని, కేసీఆర్ తమను ప్రేమిస్తున్నాడని అనుకోవడం లేదని తమ్మినేని అన్నారు.
బీజేపీతో కేసీఆర్ ఒకరోజు మిత్రుడిగా, ఒకరోజు శత్రువుగా ఉంటారని ఎద్దేవా చేశారు. బీజేపీతో శాశ్వత శతృత్వం సీపీఎంకే ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ విషయంలో తమ మద్దతు కేవలం మునుగోడు వరకే ఉంటుంది అని తమ్మినేని వీరభద్రం స్పష్టత ఇచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా అని ఎందుకన్నారని తమ్మినేని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కి ఎందుకు రాజీనామా చేయాలని తమ్మినేని ప్రశ్నించారు.
మునుగోడు సభలో అమిత్ షా బీజేపీని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని నెల రోజుల్లో ఎలా పడగొడతారని తమ్మినేని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను కొనేయడం,ఈడీతో బెదిరింపులు చేయడం, రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని విమర్శించారు.
మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలకు సంబంధించి.. ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్తో చర్చిస్తామని తెలిపారు.