ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 18 నుంచి 24 నెలల పాటు కొవిడ్-19 వైరస్ నిలిచి వుంటుందని, మిన్నెసొటా యూనివర్సిటీ అధీనంలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షస్ డిసీజ్ రిసెర్చ్ అండ్ పాలసీ (సీఐడీఆర్ఏపీ) శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికాలో 5 నుంచి 15 శాతం జనాభా మాత్రమే వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దాని ఆధారంగానే ఓ రిపోర్టును తయారు చేశామని, ప్రపంచంలో మూడింట రెండొంతుల మంది వైరస్ ను తట్టుకొనే శక్తిని సంతరించుకునేంత వరకూ వైరస్ ను నియంత్రించలేమని వెల్లడించారు.
కరోనా వైరస్ శరీరంలో ఉన్నా, ఎలాంటి లక్షణాలూ బయట కనపడకుండా ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. లోలోపల ఇన్ఫెక్షన్ ముదిరిపోతున్నా, లక్షణాలు త్వరగా బయటపడకుంటే, వైరస్ వ్యాప్తిని అంత సులువుగా అడ్డుకోలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. లెసన్స్ లెర్నడ్ ఫ్రమ్ పాండమిక్ ఇన్ ఫ్లూయంజా నివేదికలో వైరస్ ప్రవర్తిస్తున్న తీరును సైంటిస్టులు విశ్లేషించారు. ఈ సంవత్సరం చివరి వరకూ కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.