ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు నేడు నిధులు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకాలకు కొందరు దరఖాస్తు చేసుకోకపోవడం, తెలియక దూరంగా ఉండటం జరిగాయి. అయితే పథకాలకు సంబంధించి కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశమిచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను అధికారులు పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు.
కొత్తగా రాష్ట్రంలో వివిధ పథకాలకు 3 లక్షల 39 వేల 96 మంది లబ్ధిదారులు కొత్తగా ఎంపికయ్యారువీరందరికీ ముఖ్యమంత్రి జగన్ నేడు నగదును అందజేస్తారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వీరికి నగదును అందచేయనున్నారు.
పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసమూ కొత్తగా ఎంపికయ్యారు. కొత్తగా ఎంపికయిన అమ్మఒడి, ఆసరా పధకాల వంటి లబ్దిదారులకు నగదును పంపిణీ చేయనున్నారు. ఈ పథకాల కోసం దాదాపు 935 కోట్ల రూపాయల నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తారు.
మరోవైపు.. వైయస్సార్ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలోనే చర్చించి ఆమోదం తెలిపింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఏటా 8 వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే విద్యార్థుల కోసం మరిన్న పథకాలు ప్రవేశ పెట్టే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.