ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతొందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో కరోనా ప్రబలి ఎనిమిది వారాలు పూర్తయిందని, ఏడో వారంతో పోల్చితే ఎనిమిదో వారంలో పరిస్థితి మెరుగుపడిందని కేజ్రీవాల్ చెప్పారు. ఏడో వారంలో 850 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఎనిమిదో వారంలో 622 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఏడో వారంలో 21 మంది మరణిస్తే.. ఎనిమిదో వారంలో ఆ సంఖ్య తొమ్మిదికి తగ్గిందన్నారు.
అదేవిధంగా ఏడోవారంలో వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారు 260 మంది కాగా, ఎనిమిదో వారంలో డిశ్చార్జి అయిన కరోనా బాధితుల సంఖ్య 580కి పెరిగిందని కేజ్రీవాల్ చెప్పారు. ఇటీవల ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక కరోనా రోగికి వైద్యులు ప్లాస్మా చికిత్స చేశారని, ఇప్పుడు అతని ఆరోగ్యం మెరుగుపడిందని కేజ్రీవాల్ చెప్పారు.