ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు హెలికాప్టర్లో జనగామకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి.
ముందుగా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు. 25 ఎకరాల్లో మూడంతస్తుల్లో…32 కోట్ల వ్యయంతో…34 శాఖలు కొలువుతీరే విధంగా…కొత్త కలెక్టరేట్ను నిర్మించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అక్కడే పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
కాగా..సీఎం కేసీఆర్ రాకతో నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రాకతో జనగామ పట్టణాన్ని గులాబీ జెండాలతో అలంకరించారు. కేసీఆర్కు స్వాగతం పలుకుతూ…. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.