తెలంగాణలో ఆటవిక పాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, వారి అనుచరులు చేసిన దాడిపై మండిపడ్డారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడిని ఖండిస్తున్నామని అన్నారు.
విధుల్లో ఉన్న అధికారులపై టీఆర్ఎస్ నేతలు కర్రలతో దాడి చేశారని, జెడ్పీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే సోదరుడు ఇలా దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అరాచకం, అశాంతి ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా అధికారిపై దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.