హీరో విక్రమ్ కు తమిళంతోపాటు తెలుగులోనూ అభిమానులున్నారు. అద్భుతమైన నటనతో, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గతకొంతకాలంగా ఆయన నటించిన సినిమాలేవీ అభిమానులను ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు ఆయన తనయుడు ధ్రువ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నటన నుంచి విక్రమ్ పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారని, కొడుకు కెరీర్పైనే దృష్టి సారించాలనుకుంటున్నారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా విక్రమ్ పీఆర్వో స్పందించారు. విక్రమ్కు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ” సినిమాల నుంచి విక్రమ్ తప్పుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదు. ఆయన ప్రస్తుతం `కోబ్రా` సినిమాలో నటిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి కూడా ఓకే చెప్పారు. మరిన్ని ఆసక్తికర చిత్రాలకు సంబంధించిన విశేషాలను త్వరలోనే వెల్లడిస్తారు” అని ఆయన తెలిపారు.
next post